జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విన్నాను. చూడాలని అనిపించింది. వర్షమైన, వరదైన, బురదైన లెక్క చేయక 24 -07-1966 తేది బాపట్ల మీదుగా ప్రయాణమై 7వ మైలు వద్ద బస్సు దిగాను. నాతో పాటు ఒంగోలు నుండి ఒక కెమిష్టు కూడా బస్సు నుంచి దిగాడు. "జిల్లెళ్ళమూడి కి వెళ్ళే రోడ్డు గండి పడింది. మీరు పోలేరు" అని అక్కడ ఉన్నవారు హెచ్చరించారు. అయిన వినక మేము బయలుదేరాము. కుండ పోతగా వర్షం కురవటం మొదలయింది. మేము పూర్తిగా తడిసి ముద్దయిపోయాము. ఎంత వర్షం కురుసిన ఇంతకంటే ఏమి చేస్తుంది. మేము నడుస్తున్న రోడ్డు ఒక తెల్ల కాగితంమీద నల్లని గీత లాగా ఎటుచూసినా కనుచూపు మేరకు తెల్లగా అగుపించే నీళ్ళ మధ్య మాకు దారి కనిపిస్తోంది. రోడ్డుకు గండిపడిన చోటు వచ్చింది. అక్కడ కట్టబడి ఉన్న చిన్న వంతెన కూలి నీళ్ళ పాలైపోయింది. వంతెన మీద రోడ్డు ప్రక్కల ఉండే పిట్టగోడలలో ఒక గోడ మాత్రం అగుపడుతోంది. అందువలన రోడ్డు ఆ గోడకు ఎటువైపున ఉన్నదీ నీళ్ళ మధ్య గుర్తించుట ఆసాధ్య మైనది. వర్షం అంతకంతకు ఎక్కువ గాజోచ్చింది. నా వెంట ఉన్న కెమిష్టు ను నిల్చుండ బెట్టి నేనొక్కడనే లోతు చూడటానికి ఆ వరద నీటిలో కాలు బెట్టాను. నా కాలు క్రింద పీక బంటి నీళ్ళలో మునిగి పోయాను. వరద వేగంగా ఉన్నది. అయిన మనిషి కంటే ఎక్కువ లోతు లేనందున తమాయించుకుని , దాట వచ్చని నిశ్చయించుకుని, నా వెంట వుండే నాతని చేయిపట్టుకొని వరదను దాటాను. నేను వరదలో పడినప్పుడు నా జేబులోని డైరీ -27 రూపాయల నోట్లు వరదలో పడిపోయాయి. అవి నావెంట వచ్చుచుండిన అతనికి దొరికాయి. పూర్తిగా నాని పోయాయి. అది కాకతాళియంగా దొరికి ఉండవచ్చునని అనుకొంటిని. వర్షమును ఒక సంవత్సరంగా చూడని నాకు ఆ నీళ్ళ మధ్య కుండపోతగా కురియు వర్షంలో తడవటం నాకు చాలా సరదాగా వున్నది.
మేము జిల్లెళ్ళమూడి చేరుకొనక పూర్వము ఎవరో ఒకరు అమ్మతో "అమ్మా! ఈ వర్షాన్ని ఆపరాదా? అని అడిగారట. అప్పుడు అమ్మ అన్నారట " నాన్నా! వర్షము లేక అవస్త పడేవారికి, ఈ వర్షములో తడవటం కూడా సరదాగా ఉంటుంది" అని చెప్పారట. ఈ విషయం మేము అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారు మాతో చెప్పారు. సందర్భోచితంగా ఈ మాట ఎవరైనా అనవచ్చునని సరిపుచ్చుకున్నాను. అక్కడున్న వారు మమ్ములను చూచి వెంటనే అత్యంతాదరంగా మాకు పొడి గుడ్డలిచ్చారు. తడిసిన నోట్లను వెచ్చ బెట్టించి మేము ఊహించని రీతిగా సపర్యలు చేశారు. వారి ఆప్యాయత, అనునయము మాకు ఆశ్చర్యము కలిగించింది. వేష భాషల్లో ఆడంబరం లేకపోయినా వారిలో గల మానవత్వం తోటి వారిపై గల ఆత్మీయత సాటిలేనివని గమనించుట మాకెంతో కాలం పట్టలేదు.
కొబ్బరికాయ, కర్పూరం, మున్నగు సామాగ్రితో అమ్మ దర్శనార్థం వెళ్ళాము. అమ్మ మంచం మీద కూర్చుని చుట్టూవున్న వారితో కబుర్లు చెప్తుంది. అమ్మ ముఖం ప్రసన్నంగా వున్నది. అమ్మను చూడగానే పాదాలకు నమస్కరింప బుద్ధి పుట్టడం, అమ్మంతంగా వెళ్ళి పాదాలపైన బడటం క్షణం లో జరిగిపోయింది. అక్కడున్న వారిలో భవాని అనే అమ్మాయి అమ్మ గారిని పూజించుకొమ్మని సలహా ఇచ్చింది. కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగించి గంట కొట్టి పూజ చేసే అలవాటు నాకు ఎప్పటికీ లేదు గాన "నాకు రాదండీ" అన్నాను. అయినా ఆమె సలహా మేరకు పూజించాను. అమ్మ నన్ను జూచి మొదటిసారిగా "నాన్నా! అన్నం తిన్నావా" అని అడిగింది. "అమ్మా! బాగా టిఫిన్ చేశాను. ఆకలి లేదమ్మా" అన్నాను. నన్ను మంచం దగ్గరికి, తనకు చేరువగా రమ్మన్నది. నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అరటిపండ్లను ఒక్కక్కటే ఒలిచి పసివానికి తినిపించినట్లుగా తినిపించింది. అమ్మ ఆదరణలో, అనురాగంలో ఆప్యాయతలో ప్రసన్న వీక్షణావలిలో ఎంతో గుండె నిబ్బరం గల వాడనని ఎప్పుడూ అనుకునే నేను చల్లగా నీరు కారిపోయాను. నా మనస్సు సర్వేంద్రియాలు చెప్పలేని దివ్య మధురానుభూతిని అనుభవిస్తున్నాయి. అంతటి చలి గాలి లోనూ నా శరీరం చెమటలు పోసింది. కళ్ళ వెంబడి నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. సర్వం మరచి నిశ్చేష్టుడనై అమ్మను చూస్తూ అమ్మ తినిపినించే అరటిపండ్లను యాంత్రికంగా తింటూ ఉండి పోయాను. శ్రీశైలం, తిరుపతి కాళహస్తి పండరీపురం బెజవాడ కనక దుర్గ మున్నగు క్షేత్రాలను దర్శించి ఆ క్షేత్రాదిపతుల సాన్నిధ్యమున చాలాసేపు వున్నాను. నాకున్న మలిన మనస్కృత తప్ప ఏ అనుభూతి నాకు కలగలేదు. ఏ దేవుళ్ళు సన్నిధి యందు కలగని అనిర్వచ నీయమైన దివ్యమాధురానుభూతి అమ్మ సాన్నిధ్యం లో నాకు కలిగింది. ఆ రోజల్లా అమ్మ వద్ద నుండి బయటకు వెళ్ళలేదు. అమ్మ కబుర్లను వింటూవుంటే ఆకలి దప్పులుండవు. రోజులు క్షణాల్లాగా గడుస్తుంటాయి. భోజనాలు చేయాల్సిందిగా అమ్మ ఆనతి ఇచ్చింది. అమ్మ ఆనతితో వసుంధరక్కయ్య అన్నం పెట్టింది. భోజనం చేసి అమ్మ వద్ద కూర్చుని అమ్మ నిద్ర నటించగానే నేను వెళ్లి నిద్రించాను.
మరుదినం శ్రీ అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యగారితో పరిచయం కలిగింది. వారు అమ్మ వద్దనే ఎక్కువ కాలం గడుపుతూ వుంటారు. వారితో బాటు నేను కూడా అమ్మ పాదాల వద్దనే కూర్చున్నాను. అమ్మ వద్ద నాకున్న భయం పోయింది. చనువు లభించింది. మా యిద్దరికీ లంకెగా అన్నయగారు పృచ్ఛకులుగా నిలిచారు. ప్రశ్నోత్తరాలీ క్రింది విధంగా ఉన్నాయి.
ప్రశ్న :"అమ్మా! మంచికీ చెడ్డకూ భేదం తెలిసింది. ఎక్కడుండినా మనసు చెడ్డతలంపులకే ఎందుకు లాగుతుంది? చెడ్డ తలంపు వచ్చిన పిమ్మట అందుకుగాను బాధ కలుగుతుంది. అయినా మనసు చెడు తలంచక మానదు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది ఎప్పుడు, ఎట్లా పోతుంది?"
అమ్మ జవాబు : "నాన్నా! ఇప్పుడు ఏదైనా నీకు చెడ్డగా తోచిందో, ఒక కాలంలో అదే నీకు మంచిగా తోచింది. నీ మనస్సు దానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఎప్పుడైతే అది చెడ్డదనే భావం నీకేర్పడిందో ఆ క్షణమే దానిని పారద్రోలుటకు నాంది జరిగింది. అది చెడ్డదనే భావం నీకు తనంతటే కలిగింది. తరుణం రాగానే అది తనంతటదే పోతుంది. దానిని గురించి బాధపడనవసరం లేదు. మంత్రాలతో మాటలతో చిటికెలో పోయేదిగాదు".
ప్రశ్న : "అమ్మా! ఇందాక రకరకాలైన ఫోటోలలో నీ మూర్తిని చూచాను. ఒక చోట గణపతిలాగా, ఒకచోట భయంకరమైన దుర్గలాగా, ఒక చోట ప్రసన్న వదనంతో అమ్మలా ఒక చోట పరమహంసలాగా కన్పించావు. అన్ని రూపాలు నీకు ఎట్లా వచ్చాయి?"
అమ్మ జవాబు : (నవ్వుతూ) " నాన్నా! ఒకేరకమైన బొమ్మను అనేక రూపాల్లో జూచే శక్తి నీకళ్ళకున్నది. అంతేగాని బొమ్మల్లో ఏముంది?" అని తేలికగా దాటేసింది.“నాకు చెప్పటం నీకు ఇష్టం లేదులే అమ్మా!" అన్నాను. "నేను చెప్పను." అని అమ్మ కచ్చితంగా అన్నది.అన్నయ్యగారు కలుగజేసుకుని "అమ్మ నోటితో చెప్పదు, క్రియలో చూపెడుతుంది. అంతేకదమ్మా!" అన్నారు.
ఏ మహాపండితులకు లేని - ఏ పాండిత్య ప్రకర్షకు అందని అమోఘమైన శబ్దశాసనత్వం అమ్మలో ఉన్నది. ఎటువంటి క్లిష్టమైన సమస్యనయినా, జటిల ప్రశ్నకైన సులువుగా, సోదాహరణంగా వారి ప్రశ్ననుండియే సూటియగు సమాధానం అందిస్తుంది. అమ్మ సమగ్ర సకల భాషా నిఘంటువు. అమ్మ మాటలు వరాల మూటలు. కాదు రతనాల పేటలు. అంతేకాదు, అమృతపు గుళికలు. అక్షర జ్యోత్సలు. అమ్మ పడుకున్నది. అన్నయ్యగారు లేచి వెళ్ళారు. నేనొక్కడనే మిగిలిపోయాను.
అమ్మను గురించి పుస్తకమేదైనా ఉంటే చదువుకుంటూ ఉందునే అని మనస్సులో అనుకున్నాను. పడుకొని కళ్ళు మూసుకుని వున్న అమ్మ ఎవరినో పిలిచి జన్మదిన సంచికను తెప్పించి, నాకిచ్చి "చదువుకో నాన్నా! అన్నది. దీనిని కాకతాళీయమని గాని సందర్భానుసారమని గానీ అనుకోలేక పోయాను. పిల్లల ఆకలినీ అభిరుచినీ పసిగట్టి అడుగకనే అవసరమైన దానిని అందించే మాతృదేవతే అమ్మ. అమ్మ సర్వజ్ఞత్వం చూడగా కలిగిన ఆశ్చర్యం నుండి కొన్ని క్షణాలు నేను తేరుకోలేక పోయాను. సాయంకాలం దాకా ఆ పుస్తకం చదువుతూ అక్కడే కూర్చున్నాను. అమ్మ లోపలి కెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చింది. అభిషిక్తమైన దేవతామూర్తిలాగా అమ్మ అవతరించింది. సంధ్యా కాల ప్రార్ధన మనోజ్ఞంగా, మధురంగా, శ్రావ్యంగా, భక్తియుక్తంగా గానం చేయబడింది.
'అమ్మ సుప్రభాతం వినలేకపోతినే' అని మనసులో అనుకుంటున్నాను. అమ్మ నావైపు తిరిగి "నాన్నా భోజనం చేసి వచ్చి, ఇక్కడే పడుకో, ప్రొద్దున్నే సుప్రభాత స్తోత్రం విందువు గాని" అని అన్నది. అమ్మకు నాపై గల ప్రత్యేక ప్రేమకు నేను కరిగిపోయాను. నా మనస్సు ఆనందంతో పొంగిపోయింది. అమ్మకు వెంటనే పాదాభినందనం చేశాను. నా కన్నులు మరొక్కమారు ఆనందాశ్రువులను అమ్మ పాదాలపై గ్రుమ్మరించాయి.
మరు ఉదయం సుప్రభాత సంకీర్తనం జరిగింది. "ఏ తల్లి రాధికా కృష్ణ వేణువు నుండి , అమృత నాదమ్ముగా నవతరించు" అనే పద్య పాదభావం వాస్తవమని నిరూపించే నిదర్శనంగా రాధాకృష్ణశర్మ గారి కమనీయ పదజాలం ప్రవిమల భక్తి భావం పెనవేసుకున్న శ్లోక పరంపర, సుప్రభాత ప్రశాంత వాతావరణంలో శ్రీ శారదా భవానీ స్వరూపిణుల మంజుల మనోజ్ణ సుస్వర ప్రస్ఫుటాలాపనగా వినవచ్చింది. ఇతర వ్యధలని మరిచి ఏకాగ్రతతో అమ్మ పాదాలపై దృష్టి నిల్పి అలాగే కూర్చున్నాను. ‘అమ్మ' అనే శబ్దంలోని పవిత్రత, మాధుర్యం అమ్మ సంకీర్తన వల్ల గలిగే దివ్యానుభూతి అనిర్వచనీయాలు.
అన్నయ్య గారితో సహా నేను అమ్మ పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాము. అప్పుడు నా మనస్సులో ఆగష్టు 15 ఇక యిరవై రోజులే వున్నది. ఆనాడు అమ్మకు జరిగే పూజలకు హాజరుకాగలనా? అనుకున్నాను. అమ్మ దరహాసంతో నావంక జూచి "ఆగష్టు 15 నాటికి రాగలవు. వచ్చేయి" అని ఆనతి ఇచ్చింది. అమ్మ ఆనతి లోని అవ్యాజ కరుణామృతం నా శరీరమును పులకింప చేసింది. దారిలో మాకాకలి యగునని ఊహించిన అమ్మ మాకు ఉప్మా చేయించి యిచ్చింది. దానిని అమ్మ ప్రసాదంగా స్వీకరించి ప్రయాణమై వచ్చాము.
వర్షం తగ్గింది, వరద కూడా తగ్గింది. కొంతకు కొంత బురద మాత్రం అంతా ఆవరించి వుంది. రోడ్డుకు గండి పడిన చోట మాత్రం లోతైన నీటిలో దిగు నిమిత్తం గుడ్డలు సర్డుకోనుచుండగా ఒక నల్లని తేలు నా కుడి కాలి పైకి మోకాలి వరకు చర చరా ప్రాకింది. దానిని గమనించిన నేను నా కాలును జాడించటం అన్నయ్యగారు గమనించడం క్షణాలలో జరిగాయి. అయినా తేలు నాజాడింపుకు పడిపోకుండా కాలిపై నుండి క్రిందికి తనంతట తానే చక చకా దిగిపోయింది. అంతసేపువున్నా నన్ను కుట్టలేదు. అనుక్షణమూ అమ్మ అండగా వుండగా ఆపద రావడమంటూ ఉంటుందా? అమ్మ వద్ద కలిగిన మధురానుభూతులు పునశ్చరణ చేసుకుంటూ మేము బాపట్ల చేరాము.
ఆగష్టు 15వ తేదిన జిల్లెళ్ళమూడి లో అమ్మ సాన్నిధ్యంలో గడిపాను. 'నువ్వు ఆగష్టు 15న రాగలవు వచ్చేయ్యి' అన్న అమ్మ నన్ను రప్పించుకున్నది. వివిధ రీతులలో అమ్మ పూజలు, నీరాజనాలు అర్పితమైనవి. శరీర అవయవములు అణు మాత్రం కదల్చక, సంశాయాస్పదమగు ఉచ్చ్వాస నిశ్వాసములతొ అమ్మ దేవుడు లాగా కూర్చొని గంటల కొలది పూజలందుకున్నది. ఇది మానవ మాత్రులకు అసాధ్యమైనది. అమ్మ 'మానవాతీత మహిమాన్విత'- అనుకొనుటకు ఇది గూడా ప్రబల నిదర్శనం. రెప్పవేయకుండ అమ్మను తిలకించడం తప్ప అలవాటు లేని పూజలేవియూ నేను చేయలేదు. నాకా కోరికయే గలుగలేదు.
ఇదివరలో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన శ్రీ ‘శ్రీపాద గోపాలకృష్ణమూర్తి’ గారు ఆంగ్లంలో అమ్మను గురించి తాను వ్రాసిన పుస్తకమును పెద్దల సమక్షంలో అమ్మకు చదివి వినిపించు చుంటిరి. పాశ్చాత్య దేశాలలో ఆంగ్ల భాషాభ్యాస మొనర్చి నిష్ణాతులైన వారి రచనను వింటున్న అమ్మ, ఒక చోట ఆపమని చెప్పి, 'స్టమక్ ట్రబుల్' అను పదమును తీసివేసి ' స్టమక్- డి- జార్డర్' అని వ్రాయమని సవరణ చేసింది.
ఆంగ్లభాష యందు అమ్మకు ఇంతటి పాండిత్యమెలా వచ్చింది?
ఇది శ్రీ వాణీ గిరిజా స్వరూపిణి యగు అమ్మలోని సరస్వతీ స్వభావం గాక మరేమిటి?
ఆగష్టు 15 వ తేదీన రాత్రి దాదాపు మూడు గంటల సమయమున అన్నయ్యగారు, శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారు, ఇంకా ఇతర పెద్దలు అమ్మ పడుకుని యండు మంచం చుట్టూ చేరి కబుర్లు చెప్తున్నారు. అవి వట్టి కబుర్లు కావు, వేదాలు ఏమి? ఎటువంటివి? అలాంటి ప్రశ్నలు వాదాలకతీతమైన అమ్మకు వేదాలు వినోదాలుగా నున్నాయి కాబోలు పొయ్యి ,చీపురు, చేట కత్తిపీట రోలు-రోకళ్ళుతో పోల్చి సరసంగా వివరించింది. అక్కడ గుమిగూడిన 'సమావేశమునకు' –‘సమమైన ఆవేశము కలదే - సమావేశమని’ చక్కగా వ్యాఖ్యానించింది. సుప్రభాత కీర్తన మొదలైంది. వారు వెళ్ళగానే అమ్మ పాదాల వద్ద చిన్నగా చేరాను.
అమ్మ నన్ను జూచి 'ఏమి నాన్నా!' అన్నది. ఆ క్షణంలో నాకు జనించిన సంశయం నిస్సంకోచంగా అమ్మ ఎదుట బెట్టాను. 'అమ్మా! ప్రతిదినమూ ఉదయం "ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ హే మాతా!" అని నిద్ర లేపడం అవసరమా? అట్లా నిద్ర లేపకపోతే నీకు మెలుకవ రాదా? మీరింతకూ నిద్ర పోతారా?' అని అడిగాను. అమ్మ నవ్వుతూ 'మీరు మేల్కొని నన్ను నిద్ర లేపుతారు. నేను నిద్ర పోతున్నానని మీరు మేల్కొల్పుతారు. మేల్కొనుట మీకు అవసరం గనుక నేను ఆటంక పరచను. నా నిద్ర నాకుంటుంది' అని సమాధానం ఇచ్చింది. అమ్మ వద్ద శెలవు తీసుకుని నేను, శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారు , బాపట్ల వ్యవసాయ కళాశాల ఆంగ్లోపన్యాసకులు శ్రీ పురుషోత్తం గారు ‘అమ్మ గుణ గణాలను’ వర్ణించుకుంటూ తిరిగి వచ్చాము.
అమ్మ పాదాల దివ్యస్పర్శకు నోచిన జిల్లెళ్ళమూడి ఒక పవిత క్షేత్రము. కాశీలో ఉన్న అన్నపూర్ణ అన్నం పెట్టిందో లేదో నాకు తెలియదు. కానీ, జిల్లెళ్ళమూడిలో అమ్మ నిత్యాన్న దానం చేసే అన్నపూర్ణయే! కదలక మెదలక ధరణికి అతుకుకున్న శిలామూర్తి వలే కాక, ప్రతి కదలికలోనూ ప్రత్యేక దివ్యత్వము అందిస్తూ మృదు మధుర వచనామృత వాహినిలో ప్రతి హృదయాన్నీ పునీతమోనర్చే ఈ అమ్మ "మాట్లాడే దేవతయే"