అమ్మ నామాన్ని ఒక మహమ్మదీయ బాలుడు రూపొందించాడని వ్రాయబడినది. "మహమ్మదీయ" అనగా మంచి మనస్సు గలవాడు అనే అర్థాన్ని అమ్మ మనకు ప్రసాదించారు. ఆ బాలుడు ఎంత మంచి మనస్సు గలవాడు అయి ఉండకపోతే ఈ నాడు మన అందరి జిహ్వాగ్రాలపై "జయహో మాతా! శ్రీ అనసూయ! రాజరాజేశ్వరి! శ్రీ పరాత్పరీ!" నర్తిపంబడుతుంది.
ఏ కార్యక్రమాన్ని మనం తలపెట్టినా, మొదటగా వినాయకపూజ చేసికొనుట సత్సాంప్రదాయం. ఇరువది ఒక్క ఆకులతో పూజ చేస్తుంటాము. "శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి" అని ఆకులతో పూజ చేస్తాము. "జయహోమాతా" నామములో వెరశి ఇరువది యొక్క అక్షరములు ఉండటం వలన, గణపతి పూజ పత్రాలలో 21వది అర్క పత్రము (జిల్లేడాకు) కేవలము యాదృచ్ఛికం అనిపించదు. ఈ పత్రాలలో కొన్ని ఉదాహరణకు మారేడు, తులసి, మామిడి ఇత్యాదులు ప్రాశస్త్వాన్ని కలిగి ఉన్నా, గరిక-గన్నేరు మద్ది మొదలైనవి అల్పశ్రేణికి చెందినవిగా జనబాహుళ్యము చేత పరిగణించబడుతున్నాయి. అయిన అవి కూడా పూజార్హమైనవి. "ఏకవిశంతి" లో చేర్చబడినాయి. ప్రకృతిలో ఏ ఒక్కటీ మినహాయింపుకునకు గురికాకూడదనే సందేశాన్ని ఈ పత్రి పూజ తెలియజేస్తున్నది. మంత్ర సృష్టి కర్త ఎవరైనా ప్రతి అక్షరమూ శక్తి కలదే. మననం వల్ల మంత్రం అవుతున్నది. అని అమ్మ నామం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నదని నాకు అనిపిస్తుంది.